కమలాపూర్: మండలంలోని ఉప్పల్లో పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నేతాజీ రైల్వే లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా ఉప్పల్ ఆర్ఓబీ వద్ద బొగ్గు లారీలను అడ్డగించి ఆందోళన చేపట్టారు. నేతాజీ రైల్వే లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు మాట్లాడుతూ.. నేతాజీ లోడింగ్, అన్లోడింగ్ యూనియన్లో 280 మంది సభ్యులు ఉన్నారని, గతంలో తమకు ఒక్కో లోడింగ్, అన్లోడింగ్కు రూ.11 వేలు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత కాంట్రాక్టర్ మాత్రం తమకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు లేబర్తో పని లేదని, తాము లేబర్ను పెట్టుకోవాలన్న నిబంధన ఏమీ లేదని అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రూ.11 వేలు ఇచ్చినప్పుడే ఇంకొంత పెంచాలని అడిగామని, ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ మాత్రం వేతనం పెంచకపోగా మరీ అధ్వానంగా తక్కువ ఇస్తానంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరసన ఆందోళనకు దిగి బొగ్గు లారీలను అడ్డగించామని, పనికి తగ్గ వేతనం ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో లోడింగ్, అన్లోడింగ్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
పనికి తగిన వేతనం చెల్లించాలని కార్మికుల డిమాండ్


