నెక్కొండ: ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు స్వయం సహాయక గ్రూపుల్లో (ఎస్హెచ్జీ) చేరి పొదుపు బాట పట్టారని, పొదుపుతో ఆర్థికంగా ఎదగాలని అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో సోమవారం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య కోశాధికారి స్వప్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు రజిత, ఏపీఎంలు కిరణ్కుమార్, రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భాగ్య, మండల సమాఖ్య పాలకవర్గం సభ్యులు, సీసీలు, సిబ్బంది, గ్రామ సంఘ అధ్యక్షులు, వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ కల్కోట గిరికుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి కేయూ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ కె.అశోక్, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సువర్ణ, ఎస్సైలు శివ, చరణ్, మహిళా ఎస్సైలు, మహిళా కానిస్టేబుళ్లు, సైబర్ క్రైమ్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థినులు పాల్గొన్నారు.
‘నీ రుణం తీరేదెట్ల?’ పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చ రల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం సినీనటుడు రచ్చ రవి సందర్శించి అమ్మవారి సన్నిధిలో తాను రాసిన ‘నీ రుణం తీరేదెట్ల?’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం రచ్చ రవికి అర్చకులు తీర్థప్రసాదాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 596 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 19,821 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. వారిలో 19,225 మంది (97 శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు.


