నైతిక విజయం బీఆర్ఎస్దే
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నైతిక విజయం సాధించిందని, అధికార కాంగ్రెస్ అనైతిక విధానాలు అవలంబించి గద్దెనెక్కిందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. వర్ధన్నపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో 12వ వార్డు అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించి.. వెంటనే అధికారులు యూ టర్న్ తీసుకుని 7 ఓట్లతో ఓడిపోయారని ప్రకటించడం శోచనీమన్నారు. అదేవిధంగా 5వ వార్డు సభ్యురాలు రెబల్గా తమ పార్టీ నుంచి గెలుపొందగా బలవంతంగా మభ్యపెట్టి కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకుందని వాపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే 374 ఓట్లు అధికంగా వచ్చాయని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను పట్టణ ప్రజలు ఎంతో ఆదరించారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో మున్సిపల్ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నారంలో అరూరి అరెస్ట్
పర్వతగిరి: అరూరి రమేష్ను మండలంలోని అన్నారం షరీఫ్ శివారులో పర్వతగిరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్రావుతో కలిసి తొర్రూరుకు అరూరి బయలుదేరారు. అన్నారం షరీఫ్ శివారులో ఆయనను ఎస్సై ప్రవీణ్ అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆయన వెంట నాయకులు చీమల భిక్షపతి, రంగు కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ రాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్రెడ్డి, చింతల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరిలోని దయాకర్రావు నివాసంలో ఆయన సతీమణి ఉషాదయాకర్రావును తొర్రూరు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
రాష్ట్రస్థాయి గణిత సదస్సుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కాళోజీ సెంటర్: గణిత విద్య పునర్నిర్మాణం, ఆవిష్కరణలు, అనుసంధానం, ప్రభావం అంశాలపై ప్రతిఏటా పరిశోధన పత్రాలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఎన్ఇపీ –2020 కోరుతోంది. అందులో భాగంగా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా, వరంగల్ జిల్లా నుంచి ఖిలా వరంగల్ మండలం కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ ఎంపికయ్యారు. ఏడేళ్లుగా వరుసగా రాష్ట్రస్థాయి సదస్సుకు ఎంపికవుతూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను డీఈఓ రంగయ్య నాయుడు, ఏఎంఓ సుజన్ తేజ, డీఎస్ఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఖిలా వరంగల్ ఎంఈఓ ప్రసాద్, హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. కాగా, ఈనెల 19న హైదరాబాద్లో జరగనున్న సదస్సుకు హాజరు కావాలని అశోక్కు ఆహ్వానం అందింది.
మహిళల కోసం
ఆరోగ్య మహిళా క్లినిక్లు
గీసుకొండ: మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లను ఏర్పాటు చేసిందని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. గీసుకొండ, పర్వతగిరి మండలాల్లో అందుతున్న వైద్య సేవలను మంగళవారం పరిశీలించారు. ఎలుకుర్తిలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ క్లినిక్ల ద్వారా రక్తహీనత, అధిక బరువు, క్యాన్సర్, హైపర్ టెన్షన్, షుగర్, జననేంద్రియాలు వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. పీహెచ్సీల వైద్యులు ఉదయరాజు, మౌనిక, సీసీ నాగరాజు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
పర్వతగిరి: పర్వతగిరి పీహెచ్సీని డీఎంహెచ్ఓ సాంబశివరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు, రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉదయ్రాజ్, డాక్టర్ మౌనిక, ఫార్మసీ ఆఫీసర్ రాజేందర్, పీహెచ్ఎన్ నిర్మల, హెల్త్ సూపర్వైజర్ వసంత, స్టాఫ్ నర్సులు రజిత, కల్పన, తదితరులు పాల్గొన్నారు.
నైతిక విజయం బీఆర్ఎస్దే


