కాంగ్రెస్ ‘తీన్మార్’
● జనగామ, తొర్రూరు, డోర్నకల్ సైతం కాంగ్రెస్ కైవసం
● లాటరీ పద్ధతిలో జనగామ, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక
జనగామ/తొర్రూరు/డోర్నకల్: జనగామ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం హాల్లో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ సభ్యుల ఓటింగ్లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు రాగా, 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్ నెలకొంది. ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపిరామ్ లాటరీ విధానాన్ని అమలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతుదారుడు 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన ఇద్దరితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అలాగే, తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు గెలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దీంతో ఓట్లు సమానం కావడంతో ఇరు పార్టీలు సూచించిన వార్డు సభ్యులపేర్లతో చీటీలు వేసి లాటరీ తీయగా వచ్చిన పేర్లను ప్రకటించారు. ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తూనం శ్రావణ్ కుమార్ చైర్మన్గా, సోమ రజినీ వైస్ చైర్పర్సన్గా ఎంపికై నట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డోర్నకల్లో మొత్తం 15 వార్డుల్లో 11మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండగా మంగళవారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి రాజకుమారిని, వైస్ చైర్పర్సన్గా మాదా లావణ్య పేర్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ నుంచి ఎవరిని ప్రతిపాదించక పోవడంతో వారిద్దరిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ ‘తీన్మార్’


