సబ్స్టేషన్ ఏర్పాటుతో రైతుల జీవితాల్లో వెలుగులు
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి: ఈ ప్రాంత పోడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కొండాపూర్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాలు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని కొండాపూర్ గ్రామాంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ను టీఎస్ ఎన్పీడీసీఎల్ ఈఈ వెంకట్రామ్తో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోఓల్టేజీ సమస్యతో గతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. దశాబ్దాల కాలంగా రైతాంగాన్ని వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన గిరిజనేతర రైతులకు రెండు పంటలకు సాగు నీరు అందించేందుకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్తోపాటు రవాణ సౌకర్యం మెరుగుపర్చేందుకు మురళీ నగర్, గణేష్ నగర్ గ్రామాలకు నూతన రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేసిన ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తాహసీల్దార్ ముప్పు కృష్ణ, సర్పంచ్ అబ్బరబోయిన లలితసురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, నర్సంపేట డీఈ తిరుపతి, కన్స్ట్రక్షన్ డీఈ జాటోత్ హర్జీ, ఏడీఈలు లక్ష్మణ్, జానాకిరాంరెడ్డి, రవి, కుమార్, ఏఈలు మధుకర్, తరుణ్, వరస్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


