ఎఫ్ఎల్ఎస్ అమలుపై పరిశీలన
● నేడు పర్యటించనున్న రాష్ట్రస్థాయి అధికారులు
● 3వ తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అమలు
కాళోజీ సెంటర్ : ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) అమలు తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(ఎస్సీఈఆర్టీ)రంగంలోకి దిగింది. నేడు(సోమవారం) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఫ్యాకల్టీ సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి ప్రత్యేక బృందం జిల్లాలో పర్యటించనుంది. ప్రాథమిక పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎస్) సన్నద్ధతను ఈ బృందాలు పరిశీలిస్తాయి. పాఠశాలల్లో మాక్ టెస్టుల నిర్వహణ, ఎస్సీఈఆర్టీ రూపొందించిన ఐటమ్ బ్యాంక్ వినియోగం, ప్రాక్టీస్ పద్ధతులను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారు. ప్రత్యేక ప్రణాళిక మాక్ టెస్టుల ఫలితాల ఆధారంగా వెనకబడిన విద్యార్థులను టీచర్ సపోర్ట్ లెర్నర్స్ గుర్తించి, వారి కోసం ప్రత్యేక బోధనా ప్రణాళికలు సిద్ధం చేశారా.. లేదా.. అని తెలుసుకుంటారు. పరిశీలన అనంతరం జిల్లాలో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అమలు చేస్తున్న తీరుపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు ఈనెల 13తేదీలోగా నివేదిక సమర్పిస్తారు. విద్యాబోధనలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకొని తగిన సూచనలు చేయడమే ఈ తనిఖీ ఉద్దేశమని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
సామర్థ్యం పెంచడమే లక్ష్యం
ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రాథమిక నైపుణ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగా అమలు తీరును తెలుసుకునేందుకు సోమవారం జిల్లాలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ జగన్మోహన్ పర్యటిస్తారు.
– ఉండ్రాతి సుజన్తేజ, ఏఎంఓ


