ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
నర్సంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో నర్సంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కార్యక్రమాన్ని వీడియో పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తూ ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని సూచించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తమకు అప్పగించిన విధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో క్రమశిక్షణ సమన్వయం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో లెక్కింపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ సుమ, మాస్టర్ ట్రైనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి


