హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
● భారీగా తరలివచ్చిన భక్తజనం
● లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే మేడారంలోని వనదేవతలను దర్శించుకున్న భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పవిత్ర చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. వందలాది మంది భక్తులు ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రధాన ఆలయానికి క్యూ కట్టారు.
ఉత్సవమూర్తులకు శాంతి కల్యాణం
లక్ష్మీనర్సింహస్వామి జన్మదిన నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలోని యాగశాలలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజారి శేఖర్శర్మ శాంతి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామికి ఆలయ అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు ప్రత్యేక అర్చనలతో వేదమంత్రోచ్ఛరణ నడుమ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు.


