చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ
నెక్కొండ/నర్సంపేట రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. నెక్కొండ మండలంలోని అజ్మీరా మంగ్యానాయక్ తండా, చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామీణ న్యాయసంరక్షణ మద్దతు కేంద్రాలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. చాలామంది పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు న్యాయవ్యవస్థకు దూరంగా ఉండిపోతున్నారని పేర్కొన్నారు. ఈపరిస్థితిని మార్చడానికే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతిఒక్కరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్, పారా లీగల్ వలంటీర్లు కరుణాకర్, స్వప్న, హరీశ్, నెక్కొండ డీటీ రవికుమార్, ఎస్సై మహేందర్, అజ్మీరా మంగ్యానాయక్ తండా సర్పంచ్ మాలోత్ వెంకటనాయక్, గ్రామ కార్యదర్శి రంజిత్కుమార్, ఆర్ఐ నరేందర్, పీఎల్వీ రాములు, ఉపసర్పంచ్ సుమన్ ఉన్నారు.
రెండో విడత ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ
కాళోజీ సెంటర్: జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ రెండో విడత ప్రాక్టికల్స్ శనివారం ప్రారంభమయ్యాయని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 25 సెంటర్లలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 585 మంది జనరల్ విద్యార్థులకు 565 మంది, 290 మంది ఒకేషనల్ విద్యార్థులకు 287 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 420 మంది జనరల్ విద్యార్థులకు 401 మంది, 314 మంది ఒకేషనల్ విద్యార్థులకు 305 మంది హాజరైనట్లు తెలిపారు.


