స్పెషల్ ఆఫీసర్లు, కేర్టేకర్ల పాత్ర కీలకం
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్: కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు, కేర్టేకర్లుగా పనిచేయడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఓ గొప్ప సేవ అని, బాలికల భవిష్యత్ను తీర్చిదిద్దే కీలక బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గుర్తుచేశారు. హనుమకొండ నక్కలగుట్ట హరిత హోటల్లో శుక్రవారం జరిగిన వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కేజీబీవీ వార్డెన్ల సాధికారతకు శిక్షణ ముగింపు సమావేశంలో కలెక్టర్ సత్యశారద ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటితరం పిల్లలు భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారని, వారితో వ్యవహరించేటప్పుడు సహనం, సానుభూతి అవసరమన్నారు. బాలికల ఆహారం, ఆరోగ్యం, పోషణ, భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రంగయ్య నాయుడు, జీసీడీఓ కె.ఫ్లోరిన్స్, హనుమకొండ జీసీడీఓ ఎం.సునీత, మాస్టర్ ట్రైనర్ కరీంనగర్ జీసీడీఓ కృపారాణి, జ్యోతి, సరస్వతి, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతీ ఎస్సీ విద్యార్థి లబ్ధి పొందాలి
న్యూశాయంపేట: జిల్లాలోని అర్హులైన ప్రతీ ఎస్సీ విద్యార్థి ప్రీ మెట్రిక్ పథకం ద్వారా లబ్ధి జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం రిజిస్ట్రేషన్పై కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వందశాతం నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.అందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాకు ఈ పథకం ద్వారా 2,421 మంది విద్యార్థుల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు కేవలం 40శాతం మాత్రమే నమోదు అయినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9, 10వ తరగతి ఎస్సీ విద్యార్థుల వివరాలను మండల విద్యాధికారులకు నివేదిక రూపంలో అందజేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా విద్యాధికారి రంగయ్యనాయుడు, మండల విద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ ఆఫీసర్లు, కేర్టేకర్ల పాత్ర కీలకం


