ప్రభుత్వ బడుల్లో ‘క్లీన్ అండ్ సేఫ్’
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ 5.0 సేఫ్ అండ్ ప్రోగ్రాం చేపట్టింది. పాఠశాల ప్రాంగణాలు, తరగతి గదులు, వంట గదులు, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్రశిక్షలో భాగంగా అక్టోబర్ 31 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని పాఠశాలల్లో డిసెంబర్ 5 వరకు పనులు పూర్తిచేయాలి. జిల్లాలోని 344 ప్రాథమిక పాఠశాలల్లో 13,725 మంది విద్యార్థులు, 68 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,861 మంది, 134 ఉన్నత పాఠశాలల్లో 10,582 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రధాన ఉద్దేశం..
ప్రతి పాఠశాలను శుభ్రంగా, సురక్షితంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన, అభ్యసన వాతావరణం కల్పించాలి. పాత భవనాలు, ప్రమాదకర నిర్మాణాలను గుర్తించాలి. డీఈఓకు ఫొటోలు, నివేదికలు సమర్పించాలి.
పాఠశాల శుభ్రత, నిర్వహణ
తరగతి గదులు, ల్యాబ్లు, ఆఫీస్ గదులు, సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్లు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయాలి.
వ్యర్థాల తొలగింపు..
పాత ఫర్నిచర్, పాడైన వస్తువులు, ప్లాస్టిక్, మెటల్ వ్యర్థాలను వేరు చేయాలి. ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎం, ఇంజనీరింగ్ శాఖ అధికారితో కూడిన కమిటీ సూచన మేరకు పాడైన వస్తువులను సురక్షితంగా తొలగించాలి. దహనం చేయకూడదు. ఈ–వేస్ట్ను కేవలం అధికారిక రీసైక్లర్ల ద్వారా పంపాలి.
విద్యుత్, భద్రత..
పాఠశాలల్లో వైర్లు, స్విచ్లు, ప్లగ్లు తనిఖీ చేసి దెబ్బతింటే మార్చాలి. ఎంసీబీలు గ్రౌడింగ్ సరిగా ఉండాలి. విద్యార్థులు విద్యుత్ పనులు చేయకూడదు. బెంచీలు, టేబుల్స్, బోర్డులు సురక్షితంగా బిగించి ఉంచాలి.
వంటశాల భద్రత..
విద్యార్థులు వంటశాలలో ప్రవేశించరాదు. నిటారుగా ఉంచి ఎల్పీజీ సిలిండర్ల లీక్ చెక్ చేయాలి. ఫైర్ సేఫ్టీ సిద్ధంగా ఉంచాలి. వంటగది ప్రాంత ద్వారంలో నిషేధిత బోర్డు ఉంచాలి.
ఆరోగ్యం, పరిశుభ్రత..
మధ్యాహ్న భోజనం ముందు విద్యార్థులు చేతులు కడుక్కోవాలి. చెదలు, దోమలు లేకుండా చూడాలి. చెట్లు, పూల మొక్కలు నాటాలి. పాఠశాల గోడలపై శుభ్రత, ఆరోగ్య సందేశాలు రాయలి. అత్యవసర నంబర్లు (పీహెచ్సీ, ఫైర్, పోలీస్)గోడలపై రాయాలి. ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్, బ్లాకేజీలను వెంటనే సరిచేయాలి.
టైం షెడ్యూల్..
అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు పాఠశాల గోడలకు రంగులు వేయాలి. ల్యాండ్ స్కేపింగ్ బ్యూటిఫికేషన్ చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీఎస్), ఎస్ఎంసీ బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అలుమ్నీ దాతలు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 సేఫ్ అండ్ క్లీన్ స్కూల్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.
షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు..
ప్రతి ప్రభుత్వ పాఠశాలను శుభ్రంగా, సురక్షితంగా, ఆకర్షణీయంగా మార్చి, విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన, అభ్యసన వాతావరణం సృష్టించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమగ్ర శిక్ష ద్వారా విద్యాశాఖ 5.0 సేఫ్ అంం ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ప్రారంభించాం.
– డాక్టర్ కట్ల శ్రీనివాస్, సీఎంఓ
పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు స్పెషల్ క్యాంపెయిన్
డిసెంబర్ 5 వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తు
ప్రభుత్వ బడుల్లో ‘క్లీన్ అండ్ సేఫ్’


