
నేటి ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం జరగదన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై ప్రజలు రాత పూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని ఆమె కోరారు.
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు ఈనెల 7న రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ కూతాడి అర్జున్రావు రానున్నారు. ఈసందర్భంగా శంభునిగుడి, మ్యూజియ భవనం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లాకోర్సు ఏడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు.
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 6న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. కొత్తూరు, హనుమాన్నగర్ డబ్బాలు, కేయూ సెకండ్ గేట్, రెడ్డి కాలనీ, పాలజెండా, యాదవనగర్, ఏకశిల కాలేజీ, గోపాల్రావు బిల్డింగ్, కొత్తూరు మార్కెట్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. జవహర్కాలనీ, కొండా మురళి గెస్ట్హౌస్ రోడ్డు, ఎస్వీఎస్ హోమ్స్, విష్ణుపురి కాలనీ, నవయుగ కాలనీ, ద్వారకాసాయి కాలనీ ప్రాంతంలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, నయీంనగర్, లష్కర్సింగారం, రాజాజీనగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్–19 ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా హసన్పర్తి మండలంలోని భీమారం జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న నరెడ్ల శ్రీధర్ నియమితులయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వాసంతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సెక్రటరీగా శ్రీధర్ రెండేళ్ల పాటు కొనసాగుతారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
పర్వతగిరి: తాళం వేసి ఉన్న చోరీ జరిగిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మార్కెట్ యార్డు సమీపంలోని చనమల్ల నర్సయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లో తన కూతురు కాలేజీ ఫీజు కోసం దాచిన రూ.50వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు