
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
ఖానాపురం: యువత క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన లోకేష్ సెప్టెంబర్ 27, 28 తేదీల్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూత్ ఏసియన్ పారా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబర్చి అండర్ –80 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించాడు. దీంతో బుధవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లోకేష్ను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబాయ్లో నిర్వహించనున్న ఏషియన్ గేమ్స్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్ తరాల యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు.
దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల తిరుపతి–సుమలత దంపతుల కుమార్తె కావ్య నీట్ పరీక్షలో 410 మార్కులు సాధించి నిజామాబాద్ మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకుంది. టెన్త్ వరకు నర్సంపేట బిట్స్, హనుమకొండలో ఇంటర్ పూర్తి చేసింది. నీట్ రెండవ ఫేస్ కౌన్సిలింగ్లో మెడిసిన్ సీటు లభించింది. నిరుపేద కుటుంబానికి చెందిన కావ్యకు మెడిసిన్ సీటు రావడంతో గ్రామస్తులు అభినందించారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: గాంధీ జయంతి సందర్భంగా గురువారం వరంగల్ మహా నగర పరిధిలో మాంసం దుకాణాలను పూర్తిగా బంద్ చేసి యాజమానులు, విక్రయదారులు, మార్కెట్ నిర్వాహకులు సహకరించాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. ఈ మేరకు కమిషనర్ పేరుతో వ్యాపారులకు నోటీసులు జారీ అయ్యాయి. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలని కోరారు. కోళ్లు, గొర్రెలు, మేకలు, ఎద్దులను వధించకూడదన్నారు. హనుమకొండ, వరంగల్, కాజీపేటలోని జంతు వధశాలలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఆదేశాలను ధిక్కరిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం తగిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. కాగా దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు కావడం, మాంసం విక్రయాల బంద్ నేపథ్యంలో మాంసం ప్రియులు బుధవారం మటన్, చికెన్ సెంటర్ల వద్ద ఎగబడ్డారు.

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్