
‘స్థానిక’ ఏర్పాట్లలో నిమగ్నం
విడతకు ఆరు మండలాలు
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఎన్నికలను సజావుగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. నామినేషన్ల ఘట్టం సమీపిస్తుండడంతో ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జిల్లాలో రెండు విడతల్లో జరగనున్నాయి. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం, కావాల్సిన సదుపాయాలు ఒక్కోటి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ, సంబంధిత విభాగం ఉద్యోగులు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.
631 పోలింగ్ స్టేషన్లు..
జిల్లాలో మొత్తం 3,70,871 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,80,666, మహిళలు 1,90,201 మంది ఉన్నారు. ఇతరులు నలుగురు ఉన్నారు. జిల్లాలో 210 గ్రామ పంచాయతీలుండగా 631 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 400లోపు ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లు 25, 401 నుంచి 500 ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లు 67, 501 నుంచి 750 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 539 ఉన్నాయి. జెడ్పీటీసీ నామినేషన్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్లను గుర్తించారు. జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలకు గాను నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్లు గుర్తించారు. మండలంలోని ఎంపీటీసీ సంఖ్యను బట్టి రెండు నుంచి ఆరు వరకు క్లస్టర్లు ఏర్పాటు చేశారు.
రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్
అధికారుల నియామకం..
నామినేషన్ల స్వీకరణకు 58 మంది రిటర్నింగ్ అధికారులు, 58 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 500 మంది ఓటర్లలోపు ఉన్న పోలింగ్ స్టేషన్లకు ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు నలుగురు సిబ్బందిని, 500 మంది ఓటర్ల పై ఉన్న పోలింగ్ స్టేషన్ ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఐదుగురు సిబ్బందిని నియమించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు 757 మంది పోలింగ్ ఆఫీసర్లను, 3,666 మంది సిబ్బందిని నియమించి శిక్షణ కూడా ఇచ్చారు. పెద్ద బ్యాలెట్ బాక్స్లు 696, మీడియం బ్యాలెట్ బాక్స్లు 232 సమకూర్చుకుంటున్నారు. జిల్లాను 40 జోన్లుగా 74 రూట్లుగా గుర్తించారు. ప్రశాంత పోలింగ్ స్టేషన్లుగా 149, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా 240, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా 227, షైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా 15 గుర్తించా రు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటినుంచే పూర్తి చేస్తున్నారు.
ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
మరోవైపు గ్రామాల్లో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టడంతోపాటు పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్ పరంగా అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ముందుకుసాగుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పార్టీ గుర్తులపై జరగనుండడంతో ఎలాగైనా పార్టీ టికెట్ సాధించుకోవాలనే పట్టుదలతో అగ్రనేతల ఆశీస్సులు అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ,
ఎంపీటీసీ ఎన్నికలు
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్ధల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి విడత పోలింగ్ అక్టోబర్ 23న. రెండో విడత అక్టోబర్ 27న జరగనుండగా నవంబర్ 11న ఓట్లు లెక్కిస్తారు. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో మొత్తం 12 మండలాలున్నాయి. 12 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో మొదటి విడతల్లో ఆరు మండలాలు భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు మండలాల్లోని 67 ఎంపీటీసీ స్థానాలకు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో ఆత్మకూరు, దామెర, నడికూడ, పరకాల, శాయంపేట, కమలాపూర్ మండలాల్లోని 62 ఎంపీటీసీ స్థానాలకు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఇప్పటినుంచే ఎన్నికల ప్రణాళికలో అధికార యంత్రాంగం
నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్లు, 58 మంది రిటర్నింగ్ అధికారులు

‘స్థానిక’ ఏర్పాట్లలో నిమగ్నం