
‘పింగిళి’లో నాణ్యమైన విద్య
హన్మకొండ అర్బన్: వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తాజా మాజీ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం ఉదయం పింగిళి కళాశాల 2025–26 అడ్మిషన్ల పోస్టర్ను కలెక్టర్ ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పింగిళి కళాశాలలోని సైన్స్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన అన్ని విభాగాల్లో బోధనను అందిస్తున్న అధ్యాపకులకు అత్యధిక విద్యార్హతలు, దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవం ఉండడం వల్ల నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కళాశాలలో విద్యార్థినులకు కావాల్సిన అన్ని రకాల వసతులు, అత్యాధునిక బోధన ఉండడంతో విద్యార్థినులు చేరి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, దోస్త్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ సురేశ్ బాబు, అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికులపై టోల్ భారం
హన్మకొండ: ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది.
రేపు చేపూరి శ్రీరాం
29వ అష్టావధానం
విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అష్టావధాని చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం ఈనెల 15న(ఆదివారం) ఉదయం పదిగంటలకు హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నారు. కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథిగా దహగాం సాంబమూర్తి, విశ్రాంత విద్యాశాఖ అధికారి రామేశ్వర రాజు పాల్గొంటారని నిర్వాహకులు కొండా యాదగిరి, వెలుగు ప్రభాకర్ తెలిపారు. అనంతరం పద్యకవి సమ్మేళనం నిర్వహిస్తారు.
హనుమకొండ డీఎండబ్ల్యూఓగా గౌస్ హైదర్!
న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్ల్యూఓ)గా కేఏ.గౌస్ హైదర్ను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఫారిన్ సర్వీస్లో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి డిప్యుటేషన్పై మైనార్టీ సంక్షేమశాఖకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు హనుమకొండ మైనార్టీ సంక్షేమాధికారిగా మంగళవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు, ఈమేరకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు హనుమకొండ డీఎండబ్ల్యూఓగా విధులు నిర్వర్తిస్తున్న డి.మురళీధర్రెడ్డి మే నెలాఖరున ఉద్యోగ విరమణ పొందడంతో డీఎండబ్ల్యూఓ పోస్టు ఖాళీ ఏర్పడింది.
తెలుగు విభాగం ఇన్చార్జ్
అధిపతికి షోకాజ్ నోటీస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.లింగయ్యకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. లింగయ్య తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడి అవమానపర్చారని తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లింగయ్య ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

‘పింగిళి’లో నాణ్యమైన విద్య

‘పింగిళి’లో నాణ్యమైన విద్య