
జీఎంహెచ్ అభివృద్ధికి సీఎంను కలుస్తాం..
హన్మకొండ చౌరస్తా: పేదలకు వైద్య సేవలందించిన హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం, జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి సీఎం రేవంత్రెడ్డిని కోరుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఆస్పత్రిని హెరిటేజ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో కలిసి నాయిని రాజేందర్రెడ్డి ప్రసూతి ఆస్పత్రిలో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓపీ విభాగంలో రోగుల ఇన్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్షలో నాయిని మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని వైద్య సేవల స్థితిగతులు, రోగులకు అవసరమైన అదనపు వసతులు తదితర అంశాలపై పలు సూచనలిచ్చారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. 16 ఏళ్ల తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించడం, పేదలకు వైద్య సేవలందించడం కాంగ్రెస్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ అంబరీష్, స్థానిక కార్పొరేటర్ లక్ష్మి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి