పరీక్షల బోర్డు నిబంధనలు పాటించాలి
విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో స్క్వాడ్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ పాల్గొని మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా స్క్వాడ్ల బృందాలు తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించినట్లు వివరించారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 5,200 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.


