
మెడికల్ షాపుల్లో తనిఖీలు
వర్ధన్నపేట: రాష్ట్ర డ్రగ్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ శుక్రవారం వర్ధన్నపేటలో మెడికల్ షాపులు తనిఖీలు చేశారు. అపోలో ఫార్మసీ, డాక్టర్ చంద్రశేఖర్ ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. లైసెన్స్ రెన్యువల్ కాకుండా బ్లడ్బ్యాంకు స్టోరేజీ నిర్వహిస్తున్నందుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధాలు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
గీసుకొండ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గీసుకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని చింతలపల్లి రైల్వేస్టేషన్కు చెందిన కిష్టాపురం గౌతంకార్తీక్ (21) తన బైక్పై స్నేహితుడు తోట కార్తికేయను అతడి ఇంటి వద్ద దింపి రావడానికి గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు సంగెం రోడ్డు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి వారి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, గౌతం కార్తీక్ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు మృతి చెందాడు. తోట కార్తికేయ వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి తల్లి స్వరూపారాణి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్ తెలిపారు.
వివాహిత అదృశ్యం
సంగెం: వివాహిత అదృశ్యమైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన అల్లాడి రంజనీకాంత్తో సింధు (20)కు గత ఏడాది ఏప్రిల్ 24న వివాహం జరిగింది. అప్పటి నుంచి దంపతులు బాగానే ఉండేవారు. శుక్రవారం ఉదయం 8–30 గంటలకు రంజనీకాంత్, ఆయన తల్లి హేమలత, చెల్లి వన్నల శిరీష సంగెం మండల కేంద్రంలోని బంగారం దుకాణానికి వెళ్లారు. హేమలత, శిరీషను బంగారం షాపు దగ్గర వదిలి రంజనీకాంత్ వరంగల్కు వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న సింధు మధ్యాహ్నం 12–30 గంటలకు బయటకు వెళ్తుండగా.. శిరీష కుమారుడు వర్ధన్ ఎక్కడకి వెళ్తున్నావు అత్తమ్మ అంటే సింధు నీకెందుకంటూ వెళ్లిపోయింది. ఈ విషయాన్ని వర్ధన్.. మామ రంజనీకాంత్కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఇంటికి వచ్చిన ఆయన సింధు కోసం వెతికితే ఆచూకీ తెలియలేదు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై అర్చన తెలిపారు. సింధు ఆచూకీ తెలిస్తే సంగెం పోలీస్స్టేషన్ 8712685029, ఎస్సై 8712685243 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
బీఓజీ చైర్మన్ నియామకం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ బీఓజీ (బోర్డ్ ఆఫ్ గవర్నర్స్) చైర్మన్గా బీవీ ఆర్ మోహన్రెడ్డిని కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్నెళ్ల కాల పరిమితితో చైర్మన్గా ఆయన కొనసాగుతారు. కాలపరిమితి అనంతరం నూతన చైర్మన్ నియామకం జరిగేంత వరకు కొనసాగనున్నారు.

మెడికల్ షాపుల్లో తనిఖీలు

మెడికల్ షాపుల్లో తనిఖీలు