వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాటిపాముల రమేశ్ పీఆర్టీయూ టీఎస్ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరంగల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తాటిపాముల రమేశ్ మాట్లాడుతూ సంఘం పటిష్టతకు కృషి చేస్తానని, పదవి మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
లాజిస్టిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
నర్సంపేట: టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, ఖమ్మం రీజియన్ లాజిస్టిక్స్ ఏపీఎం టి.పవన్కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో మొత్తం 53 కార్గో కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రానున్న పండుగల సందర్భంగా తమ పార్సిళ్లను సకాలంలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ముఖ్యమైన పట్టణాలకు లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా వేగంగా భద్రంగా చేరవేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, వినియోగదారులు లాజిస్టిక్ సేవల కోసం app.tgsrtclogistics.co.in, https//@ tgsrtclogistics.co.in, టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వరంగల్ రీజియన్ ఏటీఎం పవన్కుమార్ (8125458546)ను సంప్రదించాలని ఆయన కోరారు.
ఏడుగురు
ఇన్స్పెక్టర్ల బదిలీ
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిఽధి వివిధ పోలీస్స్టేషన్లలో ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న ఏడుగురిని బదిలీ చేస్తూ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎ.మహేందర్ సీసీఎస్ నుంచి గీసుకొండ, జి.బాబూలాల్ గీసుకొండ నుంచి టాస్క్ఫోర్స్, ఎస్.రవికుమార్ టాస్క్ఫోర్స్ నుంచి కేయూసీ, బి.సంజీవ కేయూసీ నుంచి సీఎస్బీ, ఓ.రమేశ్ సీసీఎస్ నుంచి మామునూరు, ఎం.రవికుమార్ మామునూరు నుంచి ఐజీపీ మల్టీజోన్–1, ఎన్.శివకుమార్ ఇంతేజార్గంజ్ నుంచి సీసీబీకి బదిలీ అయ్యారు.
నేటితో రైల్వే
‘మెగా బ్లాక్’ ముగింపు●
కాజీపేట రూరల్: కాజీపేట టౌన్, హసన్పర్తి, వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గత నెల 22న చేపట్టిన చేపట్టిన అతి పెద్ద రైల్వే ఇంజనీరింగ్ ‘మెగా బ్లాక్’ పనులు సోమవారం ముగియనున్నాయి. హసన్పర్తి–కాజీపేట వరకు, కాజీపేట–వరంగల్ వరకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు తోడుగా మెగా బ్లాక్లో భాగంగా మరో రెండు లైన్ల నిర్మాణం చేపట్టారు. గతంలో కాజీపేట ఫాతిమానగర్ కార్డులైన్ మీదుగా వయా వరంగల్ నుంచి బల్లార్షా–విజయవాడ రూట్లో ప్రయాణించే రైళ్లు.. సిగ్నల్ క్లియరెన్స్ లేక కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్లో ఆపేవారు. ఇప్పుడు కొత్త లైన్ల నిర్మాణంతో రైళ్ల ట్రాఫిక్ ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా, రైల్వే బ్లాక్లో మూడో రైల్వే లైన్, బైపాస్ లైన్, కోమటిపల్లి వద్ద రైల్వే సొరంగ మార్గం నిర్మించినట్లు పేర్కొన్న రైల్వే అధికారులు.. అన్ని విధాలుగా ట్రాక్ఫిట్ అయిన తర్వాత ట్రయల్రన్ నిర్వహించి కొత్త లైన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
వివాహిత ఆత్మహత్య
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో వివాహిత మానగాని కల్యాణి (31) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన పోలు నారాయణ కూతురు కల్యాణి వివాహం నాగరాజుతో గతంలో జరిగింది. బతుకుదెరువు కోసం దంపతులు ధర్మారం వెళ్లి నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగరాజు హమాలీ పనిచేస్తున్నాడు. కొంతకాలంగా తాగుడుకు బానిసై ఇంటిలో డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో జీవితంపై విరక్తి చెందిన కల్యాణి కిరాయికి ఉంటున్న ఇంటిలో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి పోలు నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ బాబూలాల్ తెలిపారు.