
విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో శనివారంనుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని, గ్రామీణస్థాయి నుంచే ప్రచారం చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఇప్పటికే వివిధ తరగతులు చదువుతున్న విద్యార్థులకు పై తరగతులకు వందశాతం ఎన్రోల్మెంటు జరిగేలా చర్యలు చేపట్టాలని, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది. ఈమేరకు మండల, పాఠశాలల స్థాయిలో ప్లానింగ్లు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
నేటి నుంచి 9వ తేదీ వరకు ఎన్రోల్మెంట్..
బడిబాట ఎన్రోల్మెంటులో భాగంగా శనివారంనుంచి 9వ తేదీ వరకు ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు ఎన్రోల్మెంట్ చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు బడి ఈడు పిల్లలను గుర్తించి ఎన్రోల్మెంటు చేయాలని, అందుకు గాను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని సూచించారు. బ్యానర్లు, పోస్టర్లతో ప్రచారం చేస్తూ కరపత్రాలను కూడా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకం కలిగే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. చదువుకు దూరమైన పిల్లలు, బాలకార్మికులను కూడా గుర్తించి ఎన్రోల్మెంటు చేయాలని అధికారులు ఆదేశించారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ను అప్డేట్ చేయాలని, రీడ్నెస్ ప్రోగ్రాంను కూడా నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో 149 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలో 20మంది లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలు, 50 మంది లోపు విద్యార్థులున్న హైస్కూళ్లతో కలిపి మొత్తం 149 పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మిగతా పీఎస్, యూపీఎస్, హైస్కూళ్ల పరిధిలో బడిబాట ద్వారా ఎన్రోల్మెంట్ చేయనున్నారు. జిల్లాలో 780 అంగన్వాడీ సెంటర్లు ఉండగా, అందులో 9,950 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. వారందరినీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతిలో చేర్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
12నుంచి 17వరకు రెగ్యులర్ టీచింగ్
పాఠశాలల ప్రారంభం అనంతరం ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది.
● ఈనెల 12న మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా డెకరేట్ది స్కూల్స్ అనే నినాదంతో ర్యాలీలు, కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులతో రంగోళి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
● జూన్ 13వ తేదీన తొలిమెట్టు కార్యక్రమంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తారు.
● 14వ తేదీన ప్రజాప్రతినిధులను ఆహ్వానించి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తారు.
● 15వ తేదీన ప్రత్యేక అవసరాల పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలను ఎన్రోల్మెంట్ చేస్తారు.
● 16వ తేదీన ఇంగ్లిష్ మీడియం పాఠశాలలపై కూడా అవగాహన కల్పించి, ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
● ముగింపు రోజైన 17వ తేదీన 9వతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలకు ఉన్నత విద్యతో పాటు రానున్న రోజుల్లో కల్పించే అవకాశాలు గురించి బాలికల తల్లిదండ్రులకు వివరించనున్నారు.
ఇంటింటికీ ఉపాధ్యాయుల ప్రచారం
జిల్లాలో 149 పాఠశాలలపై
ప్రత్యేక దృష్టి