పవిత్ర పండుగ రంజాన్
● అదనపు కలెక్టర్ శ్రీవత్స
వరంగల్ రూరల్: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ అని, పండుగకు ప్రభుత్వం అందించే గిఫ్ట్ ప్యాకెట్లను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవత్స మాట్లాడుతూ జిల్లాలో ఇఫ్తార్ విందులకు రూ.12లక్షలు కేటాయించగా.. 6వేల గిఫ్ట్ ప్యాకెట్లను మూడు నియోజకవర్గాల పరిధిలోని 12 మసీదుల్లో పంపిణీ చేయడానికి గుర్తించామన్నారు. ఒక్కో మండలంలో 500 మంది ముస్లింలకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇఫ్తారు విందు నిర్వహించే ప్రదేశాల్లో ప్రభుత్వపరంగా శానిటేషన్, వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు నిర్వహణ, తాగునీరు వసతి, మహానగర పాలక సంస్థ ద్వారా లైటింగ్ ఏర్పాటుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కె.విక్రమ్కుమార్, బల్దియా అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్, నర్సంపేట ఏసీపీ ఏ.సంపత్రావు, వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.