వనపర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కృష్ణా, గోదావరి జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగుపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. డి.రాజిరెడ్డి సూచించారు. జిల్లాలోని నందిమళ్లగడ్డలో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల పొలాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమగ్ర సాగు విధానాలు అనుసరించడంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందడంతో పాటు రైతులకు నికర లాభాలు పెరుగుతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత సాగు, సూక్ష్మ నీటిపారుదల విధానాలను వినియోగించి తక్కువ నీటితోనే కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డా. చీనా, విశ్వవిద్యాలయ కన్సల్టెంట్ డా. వీరాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. వీణాజోషి, కేవీకే శాస్త్రవేత్త డా. రాజేందర్రెడ్డి, మండల ఉద్యాన అధికారులు శ్రీకాంత్, సాయితేజ, సురేష్, డా. శంకరస్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు.


