వనపర్తి/వనపర్తి రూరల్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా ప్రజావాణికి వచ్చిన అర్జీలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టర్లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణికి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్తో కలిసి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత అంశం తమ శాఖ పరిధిలో కానిదైతే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి 45 అర్జీలు, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 2 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, శిక్షణ ఉప కలెక్టర్ శ్రావ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


