వనపర్తిటౌన్: 2026–27 ఆర్థిక సంవత్సరం మార్చి 30 నాటికి 9 నెలల కాలం పరిమితికి వనపర్తి మున్సిపాలిటీలో నిర్వహించిన చికెన్, మటన్, చేపల వ్యర్థాల సేకరణకు మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అధ్యక్షతన మంగళవారం పుర కార్యాలయంలో వేలం నిర్వహించారు. వేలానికి 14 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ తరఫున వేలాన్ని రూ.12 లక్షలకు మొదలుపెట్టగా.. ఒక్కొక్కరు పోటాపోటీగా వేలం పాడటంతో చివరకు వెంకటయ్య అనే వ్యక్తి రూ.32.52 లక్షలకు చికెన్ వేస్టేజ్ వేలాన్ని దక్కించుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలలకు రూ.15.50 లక్షలకు చికెన్ వేస్టేజ్ వ్యర్థాల సేకరణ వేలాన్ని దక్కించుకోగా.. ఈ ఏడాది రెండింతలకు పైగా వేలం పాడటంతో మున్సిపాలిటీకి తొమ్మిది నెలల కాలానికే రూ.32.52 లక్షల ఆదాయం సమకూరనుంది. అలాగే జంతు వధశాల వేలానికి ఒకే దరఖాస్తు రావడంతో రూ.1,08,900 కు గోర్ల జగన్నాథం దక్కించుకున్నారు. వారాంతపు సంతకు ఎలాంటి టెండర్లు దాఖలు చేయకపోవడంతో వేలాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జి.మధుసూదన్ గౌడ్, కమిషనర్ బి. నిరంజన్, ఆర్ఐ రాజ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అశోక్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు పాకనాటి కృష్ణ, పరశురాం, మహేశ్వరి, విజయలక్ష్మి, క్రాంతికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


