వనపర్తి: గ్రామాల్లో ఓటరు జాబితా సవరణపై కార్యక్రమంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ.. పార్టీ శ్రేణులు, కార్యకర్తల ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నాయకులకు సూచించారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఎల్ఓలకు సమర్పించే ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు సక్రమంగా రాయకున్నా.. ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. బీఎల్ఓలతో పాటు పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు దొంగ ఓట్లను నమోదు చేయించేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని, అలాంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నారు.
తప్పులు లేకుండా నింపాలి
గోపాల్పేట: మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిముఖ్య అతిథులుగా హాజరైన కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎన్యూమరేషన్ ఫారాలపై అవగాహన కల్పిస్తూ తప్పులు లేకుండా వాటిని నింపేలా కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


