సీబీఐ ఎఫ్ఐఆర్లో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పేరు
● బదిలీ వేటు వేసి పోస్టింగ్ ఇవ్వని ఉన్నతాధికారులు
● పూర్తి వివరాలు సేకరిస్తున్న
సీబీఐ అధికారులు
● బిల్లుల చెల్లింపులపై సృష్టత కరువు
బదిలీ అయ్యారు..
ఇక్కడ విధులు నిర్వర్తించే పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న బదిలీ కావడంతో ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే బాధ్యతలు తీసుకోవడంతో అదనపు విధుల బిల్లుల చెల్లింపు సమాచారం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతాం. – ఎన్.వెంకటేశ్వర్,
ఇన్చార్జి సూపరింటెండెంట్, వనపర్తి
వనపర్తిటౌన్: బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్ల అదనపు బిల్లుల చెల్లింపు కోసం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ లంచం ఆశిస్తూ ఈ నెల 8న సీబీఐకి పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవహారంలో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని భూమన్న ఖండించినప్పటికీ.. అనూహ్యంగా సీబీఐ ఎఫ్ఐఆర్లో అతడి పేరు నమోదు కావడంతో తపాలశాఖలో కలవరం మొదలైంది. భూమన్నను వనపర్తి నుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండ్రోజుల కిందట సీబీఐ అధికారులు భూమన్న, పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్కు సంబంధించిన పూర్తి వివరాలను వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ పేరు నమోదు కావడంతో సీబీఐ విచారణ ఎవరెవరికి తలనొప్పి తెచ్చిపెడుతుందోనని సిబ్బందిలో కలవరం మొదలైంది. భూమన్న ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు.. ఆయన వ్యవహారం శైలిపై సీబీఐ దృష్టి సారించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు.


