పాన్గల్: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తూకం, తరలింపులో జాప్యం జరగకుండా చూడాలని, వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని దావాజిపల్లి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సేకరణ ప్రక్రియ, బస్తాల తరలింపుపై అధికారులతో ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రాలకు రైతులు తాలు, చెత్త, దుమ్ము లేకుండా ధాన్యం తీసుకొస్తే తూకం విషయంలో ఇబ్బందులు తలెత్తవని, శుభ్రం చేసిన ధాన్యం తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిబంధనల మేరకు తూకం చేయాలని.. మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని దించుకోవడంలో ఇబ్బందులకు గురి చేసినా, తరుగు పేరిట మోసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం, బస్తాల తరలింపులో అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు, ఆర్ఐ మహష్, సీసీ సువర్ణ, రైతులు ఉన్నారు.


