ఖిల్లాఘనపురం: జిల్లాలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. బుధవారం మండలంలోని మానాజీపేట తెలంగాణ మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా సెక్టోరియల్ అధికారులు మహానంది, ప్రతాప్రెడ్డి, ఎంఈఓ జయశంకర్. విశ్రాంత ఉప విద్యాధికారి విశ్వనాథంతో కలిసి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి శిక్షణలో నేర్పుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతో పాటు శిబిరాల్లో అందిస్తున్న కంప్యూటర్, కుట్లు అల్లికలు, క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. శిక్షణలో నేర్పిన అంశాలు మున్ముందు ఉపయోగపడతాయని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో వేసవి శిబిరం నిర్వహిస్తున్న మానాజీపేట హెల్పింగ్ హ్యాండ్ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని పురస్కరించుకుని క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. బడిబాట పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీలత, ఉపాధ్యాయులు రాఘవేందర్, క్యాంపు వలంటీర్లు తదితరులు ఉన్నారు.


