వనపర్తి: రైస్మిల్లర్లు సన్నరకంతో పాటు దొడ్డురకం వరి ధాన్యాన్ని కూడా దించుకొని ప్రభుత్వానికి సహకరించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్ ధాన్యం కేటాయింపునకు జిల్లాలో 55 మిల్లులు మాత్రమే అర్హత సాధించాయని.. వాటిలో 9 మంది మినహా మిగతా మిల్లర్లు దొడ్డురకం వరి ధాన్యాన్ని దించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోందన్నారు. మిల్లర్లు ఈ సీజన్లో సన్న, దొడ్డురకం వరి ధాన్యం దింపుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సహకరించని మిలర్లను ప్రభుత్వ ఆదేశానుసారం బ్లాక్లిస్టులో ఉంచుతామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని.. పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తగిన ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాల సంఘం జిల్లా మేనేజర్ ఆంజనేయులు, గిడ్డంగుల కార్పొరేషన్ రీజనల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


