గోపాల్పేట: మండల కేంద్రంలోని పురాతన కోదండ రామస్వామి ఆలయంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, భక్తుల సమక్షంలో అర్చకులు రాములోరి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు.. మధ్యాహ్నం 12 నుంచి పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. చాలామంది భక్తులు పంచెలు, చీరలు ధరించి సాంప్రదాయ పద్ధతిలో ఆలయానికి చేరుకొని వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు సీతారామలక్ష్మణులతో నాణేలను తయారు చేయించి ప్రత్యేక పూజల అనంతరం దంపతులకు అందజేశారు. అలాగే రాత్రి 8.30 గంటలకు రామాలయం నుంచి కేశవాలయం వరకు పల్లకీసేవ నిర్వహించారు. ఆదివారం ఉదయం నిత్యహోమం, సుందరకాండ హోమం, రాత్రి 11 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


