వనపర్తి: జిల్లాలో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్, ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకుత తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జయంతి వేడుకల నిర్వహణపై దళిత, ప్రజాసంఘాల నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయా రోజుల్లో మహనీయుల జీవితగాథలను అందరికీ తెలియజేసేలా కళాజాతా నిర్వహించాలని, కార్యక్రమాలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాంజీరావు, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, దళిత, ప్రజాసంఘాల నాయకులు గంధం గట్టయ్య, గంధం నాగరాజు, మాదారి భోజరాజు, విశ్వం, వీరప్ప, రమేష్, భరత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


