వనపర్తి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏప్రిల్లో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ప్రతి ఓటరు 3 ఫారం పూరించి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి బూత్కు ప్రతి పార్టీ నుంచి ఏజెంట్ను నియమించి వారి జాబితా సమర్పిస్తే గుర్తింపుకార్డు జారీ చేస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ నిబంధనలు వివరిస్తూ ఓటరు 1987 కంటే ముందు దేశంలో జన్మించి ఉంటే అందుకు సంబంధించిన ఆధారం (గుర్తింపు కార్డు) సమర్పించాల్సి ఉంటుందన్నారు. 1987 తర్వాత జన్మిస్తే అతడితో పాటు అతడి తండ్రి ఆధారం ఉండాలని సూచించారు. పుట్టిన తేదీ లేదా స్థలం ఆధారానికి ఎన్నికల సంఘం 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇప్పటి వరకున్న ఓటరు జాబితాను పూర్తిగా జీరోచేసి మొదటి నుంచి కొత్త ఓటరు జాబితా రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, వివిధ పార్టీల నాయకులు శ్రీనివాస్గౌడ్, కుమారస్వామి, పెద్దిరాజు, కొత్తగొల్ల శంకర్, వేణాచారి తదితరులు పాల్గొన్నారు.


