మదనాపురం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. అజ్జకొల్లు పర్యటనలో భాగంగా మదనాపురం చేరుకున్న రాష్ట్ర అధ్యక్షుడికి స్థానిక బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. భారత్ మాతా కీ జై నినాదాలతో మండల కేంద్రంలోని వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు. జిల్లాలో ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. అనంతరం ఇటివల అజ్జకొల్లులో అడ్వకేట్ రాజవర్ధన్రెడ్డి మాతృమూర్తి మరణించడంతో రాంచందర్రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ, వనపర్తి శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు ఎద్దుల రాజవర్ధన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, కొత్తకపు మాధవరెడ్డి, వంగూరు రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్, అమర్నాథ్ శెట్టి, బాబుగౌడ్, అంజన్నయాదవ్, బాలవర్ధన్, కావలి శివ తదితరులు పాల్గొన్నారు.


