గోపాల్పేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం ఆయన మండలంలోని బుద్దారం గ్రామంలో పర్యటించి గతంలో మంజూరైన 40 డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్ తిలక్కుమార్ అధ్యక్షతన ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ, కార్యదర్శితో కమిటీ ఏర్పాటు చేసి గతంలో ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అర్హులెవరు అనే వివరాలతో పూర్తి నివేదికను పదిరోజుల్లో తనకు అందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించుకోలేని పరిస్థితిలో ఉంటే స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ విఠోభా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.


