అమరచింత: రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు కోత విధించేలా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ ఆరోపించారు. శనివారం మండలంలోని పాంరెడ్డిపల్లిలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సరిపడా బడ్జెట్ కాదని విమర్శించారు. భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి ఒకసారి మాత్రమే రూ.6 వేలు చెల్లించి, మిగతా రూ.18 వేలు బకాయి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రైతుబీమా పథకాన్ని ఎత్తివేసేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమాపై స్పష్టత ఇవ్వాలని.. కుటుంబానికి కాకుండా రైతు బీమా తరహాలో రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేయూత పింఛన్ రెట్టింపునకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 నగదు ఊసే లేదని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ మరిచారని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సరిపడా బడ్జెట్ కేటాయించాలన్నారు. శంకర్, మోహన్, అశోక్, మణెమ్మ, చెన్నప్ప, షేక్ అహ్మద్, అనంతరెడ్డి పాల్గొన్నారు.


