● సిమెంట్ దిమ్మతో తలపై కొట్టి చంపి, శరీరంపై పోసిన మరిగిన నూనె ● అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్నాయత్నం చేసిన నిందితురాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కందిపేట గ్రామంలో కలిసి జీవనం సాగిస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తనతో కలిసి జీవిస్తున్న ధనాల శ్రీను(34) అనే వ్యక్తిపై రాములమ్మ సిమెంట్ దిమ్మతో దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాములమ్మకు గతంలోనే వివాహం కాగా భర్తను విడిచి దూరంగా ఉంది. అదే విధంగా మృతుడు ధనాల శ్రీను కూడా వివాహం చేసుకుని భార్యను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలో వారిద్దరూ పరిచయం పెంచుకుని ఎనిమిది నెలల క్రితం నుంచి భార్యాభర్తల మాదిరిగా కందిపేట గ్రామంలో జీవిస్తున్నారు. శ్రీను విశాఖపట్నంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ అప్పుడప్పుడూ కందిపేట వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ మధ్య ఐదు రోజులుగా కందిపేట గ్రామంలోనే ఉంటున్నాడు. తనను కూడా విశాఖపట్నం తీసుకుపోవాలని కొంతకాలం నుంచి రాములమ్మ అడుగుతుండడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. బుధవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో తనను విశాఖపట్నం తీసుకువెళ్లిపోవాలని శ్రీనుపై రాములమ్మ ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో రాములమ్మ మంచం కాళ్ల కింద పెట్టిన సిమెంట్ దిమ్మతో శ్రీను తలపై గట్టిగా కొట్టి హత్య చేసింది. అంతటితో ఆగకుండా ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతుని ముఖం, శరీరంపై మరిగిన నూనెను పోసింది. హత్య అనంతరం రాములమ్మ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై బి.లోకేశ్వరరావులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను వైద్య చికిత్స నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేయగా సీఐ శంకరరావు దర్యాప్తు చేస్తున్నారు.


