● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: నేరస్తులకు కోర్టులో శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు సాగినప్పుడే పోలీసు శాఖకు గౌరవం దక్కుతుందని, సమాజంలో నేరం చేయాలంటే వణుకు పుడుతుందని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్యలు, ప్రాపర్టీ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకోవాలని సూచించారు. బందోబస్తు విధుల్లో సిబ్బంది తప్పనిసరిగా బాడీవోర్న్ కెమెరాలు ధరించాలని, సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో గగనతల పహారా కొనసాగించాలని ఆదేశించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అత్యంత సున్నితమైన (హైపర్ సెన్సిటివ్) గ్రామాలపై నిఘా పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దత్తత గ్రామాల పోలీసులు ‘మన్యంతో మమేకం’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని కోరారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి శాఖలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి అదుపు, ఆస్తుల రికవరీ, కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన 38 మంది సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మారూఫ్, రమణ, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.


