వేపాడ: మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన జొన్నపల్లి సన్నిబాబు(63) పిడుగుపాటుకు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని అప్పలఈశ్వర చెరువులో ఉపాధిహామీ పని ముగిశాక సన్నిబాబు, గొర్రెపోటు దేవి, గొర్రెపోటు చిన్నమ్మి ఇంటికి వస్తుండగా పిడుగుపడింది. ప్రమాదంలో సన్నిబాబు అక్కడికక్కడే మృతిచెందగా, గొర్రెపోటు దేవి మెడలో ఉన్న బంగారం ఆభరణం సగంవరకు కరిగిపోయింది. సెల్పోన్ కొంతవరకు కాలిపోయింది. మరో మహిళ చిన్నమ్మికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరిని ప్రైవేటు వాహనంలో, మరో ఇద్దరిని 108లో ఎస్కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గొర్రెపోటు దేవి శరీరంపై వచ్చిన మంటలను అక్కడే ఉన్న అంజలి ధైర్యంగా అదుపుచేయడంతో ప్రాణాలు నిలిచినట్టు గ్రామస్తులు తెలిపారు. ఉపాధిహామీ వేతనదారు మృతితో సోంపురంలో విషాదం అలముకుంది.


