చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్లో గల గాంధీ బొమ్మ సెంటర్లో లక్కిడాపు రఘు(30) అనే యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన రఘు గాంధీ బొమ్మ సెంటర్లో చెప్పులు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం కూడా దుకాణం తెరిచి పని చేసుకుంటున్నాడు. అయితే గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో దుకాణం వద్దే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తెర్లాంలో ఉపాధి వేతనదారురాలు
తెర్లాం: ఉపాధి పని చేస్తుండగా మహిళా వేతనదారు వడదెబ్బకు గురై మృతి చెందింది. తెర్లాం మండలంలోని నందిగాం గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలి లా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుల్లిపల్లి తౌడమ్మ(62) గ్రామంలోని చౌదరి చెరువులో జరుగుతున్న ఉపాధి పనులకు గ్రామస్తులతో కలిసి గురువారం ఉదయం వెళ్లింది. చెరువులో పనిచేస్తుండగా ఒక్కసారి కళ్లు తిరిగి పనిచేస్తున్న ప్రదేశంలోనే సొమ్మసిల్లి పడిపోయింది. తోటి వేతనదారులంతా కలిసి తౌడమ్మను తెర్లాంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గ్రామ వీఆర్ఓ ఇచ్చిన సమాచారం మేరకు మండల ఇన్చార్జ్ తహసీల్దార్ గొంగాడ సత్యనారాయణ వెళ్లి పరిశీలించారు.


