● కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం అనంతరం ఆంజనేయస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని తమలపాకులు, సిందూరం, పుష్పాలతో సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, కిరణ్కుమార్, పవన్, రామగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
వాడవాడలా భక్తి శ్రద్ధలతో
హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కొత్తపేట, ఒమ్మి, సతివాడ, గొర్లిపేట, తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు జరిపారు. విగ్రహాలకు భారీ పూలదండలు వేసి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు.


