కొత్తవలస: మండల కేంద్రంలోని కొత్తవలస గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మేలాస్త్రి చల్లంనాయుడు, అప్పలలక్ష్మిలపై ఈ నెల 19న వారి ఇంటిలో హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ సీహెచ్ షణ్ముకరావు తెలిపారు. ఈమేరకు సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చల్లంనాయుడు దంపతులకు పిల్లలు లేకపోవడంతో కొద్ది సంవత్సరాల కిందట వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన డేగల సన్యాసినాయుడు ఉరఫ్ గణేష్ను దత్తత తీసుకున్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత చెల్లంనాయుడు దంపతులకు కుమారుడు కలిగాడు. ఈక్రమంలో తనపై ప్రేమ తగ్గిందనే ఉద్దేశంతో గణేష్ పది సంవత్సరాల కిందట తన సొంత తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయాడు. అయితే పెంపుడు తండ్రి తనకు ఆస్తి ఇవ్వలేదనే కక్షతో ఎలాగైన అతడ్ని హతమార్చేందుకు పథకం రచించాడు. దీంతో విశాఖపట్నం జిల్లా నాయుడుతోట, వేపగుంట ప్రాంతాలకు చెందిన శ్రీలం మనోహర్, మెండి బ్రహ్మయ్య, శ్రీలం రాజేష్, చింతల రాంబాబు, రవి అజయకాంత్లతో మాట్లాడి రూ. 5 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 19న వృద్ధ దంపతులపై వారి ఇంటిలోనే మారణాయుధాలతో దాడి చేశారు. అయితే వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోగయ్యారు. దీంతో నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ మేరకు చెల్లంనాయుడు దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పెందుర్తి జంక్షన్ వద్ద నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు.


