విజయనగరం క్రైమ్ : ఎస్పీ దామోదర్ను ఆయన బంగ్లాలోనే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం కలిసి అభినందనలు తెలిపారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తు, ఇంటెలిజెన్స్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్పీకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్కృష్ట సేవ పథకం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని బాలాజీనగర్లో క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిసిన ఎంపీ కలిశెట్టి దుశ్శాలువతో సత్కరించారు. జిల్లాకు, రాష్ట్రానికి ఎస్పీ చేస్తున్న సేవలను ఎంపీ కొనియాడారు.
రాజ్యలక్ష్మికి ఉత్తమ
వైద్యాధికారిణి అవార్డు
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న కె.రాజ్యలక్ష్మి జిల్లా స్థాయి ఉత్తమ వైద్యాధికారిణి అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం పురష్కరించుకుని విజయవాడలో శనివారం నిర్వహించిన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో టీబీ అసోసియేషన్ ప్రతినిధులు చేతులు మీదుగా ఈ అవార్డును రాజ్యలక్ష్మి అందుకున్నారు. టీబీకి సంబంధించిన వంద రోజుల కార్యక్రమాన్ని అన్ని విభాగాల్లో ఉత్తమంగా నిర్వహించారు. రాష్ట్ర, సెంట్రల్ టీంలు గరివిడి పీహెచ్సీని సందర్శించినప్పుడు వైద్యాధికారితో పాటుగా వైద్య సిబ్బంది ఈ టీబీ కార్యక్రమంపై మంచి అవగాహన కల్గి ఉండటంతో జిల్లా ఉత్తమ వైద్యాధికారిణిగా ఎంపిక చేశారు. ఈ మేరకు రారష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎలిమినేషన్ కార్యక్రమంలో అవార్డును అందించారు.
విద్యుత్ షాక్తో మేకల మృతి
శృంగవరపుకోట : మండలంలోని కిల్తంపాలెం నవోదయ స్కూల్ పరిసరాల్లో శనివారం ఉదయం విద్యుత్ షాక్కు గురై రెండు మేకలు మృతి చెందాయి. ఈ ఘటనకు సంబఽంధించి వివరాలిలా ఉన్నాయి. ముషిడిపల్లి పంచాయతీ బందవలస గ్రామానికి చెందిన దూరి దేముడు మేకలు మేపుతున్న సమయంలో రెండు మేకలు వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి విరుచుకు పడిపోయాయి. వాటికి సమీపంలో ఉన్న దేముడు వెనక్కి దూకి ప్రాణాలు దక్కించుకుని గ్రామంలోకి పరుగు తీసి విషయం చెప్పాడు. గ్రామస్తులు విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయటంతో వారు విద్యుత్ సరఫరా నిలిపారు. ఘటనా స్థలం గంట్యాడ పరిధిలో ఉండటంతో విద్యుత్ శాఖ ఏఈ ఎం.శ్రీనివాసరావు వచ్చి పరిశీలించారు. చనిపోయిన మేకలకు నష్ట పరిహారం కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు.
ఆవు మృతి
బలిజిపేట: అంపావల్లి గ్రామానికి చెందిన సురేష్ ఆవు మృతి చెందింది. గత నెలలో పంపుహౌస్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీకయిన విషయం విదితమే. ఆ సమయంలో సమీపంలో ఉండే పశువులు, మనుషులకు ప్రమాదం ఎదురైంది. అప్పట్లో చూడుకట్టి ఉండే ఆవు చూడు పోయి, శక్తిహీనమై శనివారం మృతి చెందినట్టు తెలిపారు. ఆవు విలువ రూ.50వేలు ఉంటుందని తెలిపారు. అప్పట్లో వైద్యులు పరీక్షలు నిర్వహించి పశువులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలిపారని గ్రామస్తులు తెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. ఇదిలా ఉండగా ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని సీపీఎం నాయకుడు మన్మధరావు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


