బొబ్బిలి: పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఏకకాలంలో శ శనివారం దాడులు నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీలో రికార్డులు పరిశీలించారు. నిర్వాహకులు జలగం ప్రసాదరావును గ్యాస్ విడుదలైన తరువాత కొత్త గ్యాస్ బండ రావడానికి మధ్య ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. వస్తున్న సిలిండర్లెన్ని, ఎన్ని రోజులకు ఓసారి వస్తున్నాయనే వివరాలు నమోదు చేసుకున్నారు. అక్కడి గ్యాస్ సిలిండర్ల గోదామును తనిఖీ చేసి నిల్వలను లెక్కించారు. మరో పక్క పట్టణంలోని విజయలక్ష్మి మెస్–3, గణేష్ రెస్టారెంట్–2, సాయిరాం దాబా–2, విజయలక్ష్మి రెస్టారెంట్–3, రాజు స్వీట్స్ బేకరీ–3 తదితర హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగిస్తున్నట్టు గుర్తించి 13 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారానికి గృహావసరాల సిలిండర్లు
వినియోగిస్తే కేసులు
అనంతరం సీఐలు బి.సింహాచలం, డీవీవీ సతీష్కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ హోటళ్లు, బేకరీలు, ఇతర అవసరాలకు వాణిజ్య సిలిండర్లే వినియోగించాలని, గృహ వినియోగ సిలిండర్లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. గ్రోత్ సెంటర్లోని పలు కంపెనీలకు కూడా వాణిజ్య అవసరాల గ్యాస్ బండలు సరఫరా అవుతున్నాయన్నారు. వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్న 51వేల గ్యాస్ కనెక్షన్లకు నిత్యం వెయ్యికి తక్కువ కాకుండా గ్యాస్ బండలు వస్తున్నాయనీ, ముందుగా బుక్ చేసుకోవడం వలన పలువురికి బుక్ కావడం లేదన్నారు. ఎస్సై వి.రామారావు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ రెడ్డి సాయికృష్ణ, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.
13 సిలిండర్లు స్వాధీనం


