వద్దంటున్నారా..
అవసరం లేదనుకుంటున్నారా..!
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా!’ అన్న చందాన ఉంది జిల్లాలోని అధికార యంత్రాంగం తీరు. చంద్రబాబు పాలనలో జిల్లాలోని పాలకులకు.. తోటి ప్రజాప్రతినిధులంటే లెక్క లేదు. మహిళలన్న గౌరవమూ ఉండదు. ఎన్నికల వరకే రాజకీయాలు చూడాలన్న విషయాన్నీ మర్చిపోతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులకు కనీస విలువ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారు తానా అంటే.. జిల్లా యంత్రాంగం తందానా అంటోంది. ఎమ్మెల్యేలు డైరెక్షన్ చెబితేనే.. అధికారులు యాక్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● యువ ఎంపీకి ఇచ్చిన
గౌరవం ఇదేనా?
ఉన్నత విద్యావంతురాలు.. డాక్టర్ వృత్తిని వదిలి, రాజకీయాలంటే ఆసక్తితో అరకు పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గుమ్మా తనూజారాణి పోటీ చేశారు. ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ కూటమి పార్టీలు కై వసం చేసుకున్నప్పటికీ.. ఎంపీగా ప్రజా మద్దతు తనూజారాణికే లభించింది. మొదటిసారిగా ఎన్నికై నా ఆమె ఎప్పుడూ హూందా రాజకీయాలనే చేసుకుంటూ వస్తున్నారు. ప్రత్యర్థులను విమర్శించడం అరుదు. ప్రజా సమస్యలపైన, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపైనే ఆమె గళం వినిపిస్తున్నారు తప్ప.. ప్రత్యేకించి ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా విరుచుకుపడడం కనిపించదు. చిన్న వయసులోనే ఎంపీగా రాణిస్తున్న సాటి గిరిజన మహిళను.. జిల్లాలోని తోటి ప్రజాప్రతినిధులే అవమానిస్తుండడం.. అందుకు అధికార యంత్రాంగం సహకరిస్తుండడం గమనార్హం.
అరకు పార్లమెంట్ పరిధిలోని సాలూరులో 30 పడకల ఆస్పత్రిని.. వంద పడకలకు అప్గ్రేడ్ చేస్తూ, నిర్మించిన నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆస్పత్రిని ప్రారంభించగా, అధికారులు కనీస ప్రొటోకాల్ను పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో పిలిచామన్నట్లుగా ముందు రోజు సాయంత్రం ఎంపీ తనూజారాణిని సంప్రదించి, ఆస్పత్రి ప్రారంభ విషయం తెలియజేశారు. ఎంపీగా దిల్లీ, అరకు పార్లమెంట్ పరిధిలో ఆమె ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. ముందుగా తెలియజేస్తే.. అందుకు తగ్గ విధంగా షెడ్యూల్ నిర్ణయించుకుంటారు. అందుకు భిన్నంగా ముందు రోజు వరకూ పిలవకపోవడంపై అధికారుల మీద ఎవరి ఒత్తిడైనా ఉందా? లేక వీరే విస్మరించారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎంపీ తనూజారాణి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపీ పట్ల ఇలా వ్యవహరించడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సభ్యురాలు తనూజారాణి పట్ల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ చిన్నచూపు చూస్తోంది. అరకు ఎంపీగా 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి తనూజారాణి ఘన విజయం సాధించారు. పార్లమెంట్లో భాగమైన జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలకూ ఆమెనే ఎంపీ. జిల్లాలో అందరూ కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో అధికారిక కార్యక్రమాలకు ఆమెను భాగస్వామ్యం చేయడం లేదు.
గతంలో సీతంపేట ఐటీడీఏలో జరిగిన సమావేశంలోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశాన్నీ మొక్కబడిగా నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో రాకపోవడం, అడిగిన సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం చెందారు.
ప్రొటోకాల్ పక్కన పెట్టేస్తున్న
అధికారులు
ప్రజల ఓట్లతో ఎన్నికై న ఎంపీని అవమానిస్తున్న వైనం
రాజ్యాంగానికి అపహాస్యం
ఎమ్మెల్యేల డైరెక్షన్..
అధికారుల యాక్షన్


