బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయులు విధులను విస్మరించి గ్రామంలోని తాగునీటి ట్యాంకు, వివిధ కార్యాలయాల ప్రారంభోత్సవంలో నిమగ్నమయ్యారు. అంతే... పిల్లలకు పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. తరగతి గదిలోనే పిల్లలు ఆడుకున్నారు. అనంతరం పిల్లలు కూడా ప్రారంభోత్సవం వద్దకు చేరుకుని ఉపాధ్యాయులు పాఠశాలకు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూశారు. తీరా ఎప్పటికీ రాకపోయేసరికి తరగతిలోని ఓ విద్యార్థినే ఉపాధ్యాయురాలిగా మారి బోర్డుపై రాసిన పేర్లును తోటి విద్యార్థులతో చదివించింది. ఈ దృశ్యాలు రామభద్రపురం మండలం రొంపల్లి, వంగపండువలస ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం చోటుచేసుకున్నాయి. మాస్టార్ల తీరును ఆయా గ్రామాల ప్రజలు తప్పుబట్టారు. విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు.. పాలకులు వస్తున్నారన్న అత్యుత్సాహంతో పాఠశాలలను వదిలేసి ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం.. నేతలు వెళ్లిపోయే వరకు అక్కడే ఉంటూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడడాన్ని తప్పుబట్టారు. ఇదే విషయాన్ని ఎంఈఓ–1 తిరుమలప్రసాద్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వంగపండువలస ప్రాథమిక పాఠశాలకు వెళ్లి అక్కడి టీచర్ను విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. పాఠశాల సమయంలో ఏ టీచర్ అయినా పిల్లలను తరగతి గదిలో విడిచిపెట్టి బయటకు వెళ్లకూడదన్నారు. రొంపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవంలో తను పాల్గొన్నానని, అక్కడి రెగ్యులర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంను తనే స్వయంగా పిలిచినట్టు సెలవిచ్చారు. – రామభద్రపురం


