మొక్కజొన్న గింజలను ప్రభుత్వం ప్రకటించిన క్వింటా రూ.2,400 మద్దతు ధరకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు. మొక్కజొన్న గింజల కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాలం ఆధ్వర్యంలో పాల్తేరు గ్రామంలో శుక్రవారం ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రబీ సీజన్లో జిల్లాలో సుమారు 60వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చేతికొచ్చిన పంటను క్వింటా రూ.1600 నుంచి రూ.1700కు విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈదుర గాలులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 23న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని రైతుసంఘం నాయకుడు గోపాలం పిలుపునిచ్చారు. – బాడంగి


