
ఆహ్లాదం మాటున విషాదం
ఆడలి వ్యూపాయింట్ పరిస్థితి ఇది..
ఆడలి వ్యూ పాయింట్ను అన్ని విధాలా తీర్చిదిద్దారు. సీతంపేట– పాలకొండ మధ్య ఉన్న కుశిమి జంక్షన్ నుంచి 6 కిలోమీటర్ల మేర సాగే ప్రయాణంలో దారి మధ్యమధ్యలో వచ్చే ప్రతి మలుపులో ప్రకృతి అందాలు అటువైపుగా వెళ్లే వారిని కట్టిపడేస్తాయి. ఇక వ్యూపాయింట్ వద్దకు వెళ్లే సరికి మంచుపొరలు, చల్లనిగాలి వంటి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతాయి. ఘాట్రోడ్లో ఉండే మలుపులే సందర్శకులను భయపెడుతున్నాయి. ఇటీవల ఆడలి వ్యూపాయింట్ వద్ద ఉన్న రక్షణగోడకు ఉన్న బండరాళ్లు పక్కనే ఉన్న క్యాంటీన్పై పడిపోగా క్యాంటీన్లో ఉన్న నలుగురు వ్యక్తులు పరుగులంకించారు. తాజాగా సీతంపేట ఏజెన్సీలో పర్యటించి నూతన కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆడలి వ్యూపాయింట్ను సందర్శించారు. ఇక్కడ ఎకోటూరిజంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సీతంపేట: మరో పక్షం రోజుల్లో పిక్నిక్ల సీజన్ ఆరంభం కానుంది. ఈ సమయంలో పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పర్యాటకులను కట్టిపడేసే అందమైన వ్యూపాయింట్లు చూడడానికి సీతంపేట ఏజెన్సీకి వస్తున్న టూరిస్టులు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. జగతపల్లి వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో జగతపల్లి మలుపు వద్ద ఇప్పటి వరకు ఇద్దరు, ఆడలి వ్యూపాయింట్ మార్గంలోని వెల్లంగూడ సమీపంలో మలుపుల వద్ద నలుగురు మృతిచెందారు. ఆరుగురు మృతిచెందగా 30 నుంచి 40 మంది వరకు క్షతగాత్రులై ఆస్పత్రి పాలయ్యారు. పర్యాటకుల ప్రాణాలు ఘాట్రోడ్లు హరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
జగతపల్లి వ్యూపాయింట్ను పరిశీలిస్తే..
సీతంపేట ఏజెన్సీలో సుమారు రూ.7 కోట్ల అంచనా వ్యయంతో జగతపల్లి వ్యూ పాయింట్ను అభివృద్ధి చేయదలిచారు. వాటిలో ఇప్పటి వరకు వ్యూపాయింట్ నిర్మించారు. ఇంకా రిసార్ట్ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇక్కడి నుంచి చూస్తే ఏజెన్సీలో పలు గ్రామాలు, పచ్చని కొండలు, ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడి వ్యూ పాయింట్కు సీతంపేట నుంచి దోనుబాయి రోడ్డుకు వెళ్లే మార్గంలో దేవనాపురం మీదుగా జగతపల్లి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ రోడ్డులో పెద్ద పెద్ద మలుపులు ఉన్నాయి. మలుపులు దాటుకుంటూ వెళ్లాలి. ప్రస్తుతం ఆడలి అంత ప్రాచుర్యం జగతపల్లికి లేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇంకా ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యాటక పరంగా నిర్వహించడం లేదు. టిక్కెట్ల ధరలు, ఫొటోషూటింగ్, క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయలేదు. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు.
కొన్నాళ్లుగా జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే..
జగతపల్లి వ్యూపాయింట్ నుంచి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి మూడేళ్ల క్రితం ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిరోజుల కిందట పాలకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయికృష్ణ ఇదే ఘాట్రోడ్లో ద్విచక్రవాహనం స్కిడ్ అయి మృతిచెందారు. ఇక ఆడలిలో 8నెలల కిందట పాలకొండలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన భారతి తన భర్త, పిల్లలతో కలిసి వ్యూపాయింట్ అందాలు చూసి ఇంటికి వెళ్తుండగా వెల్లంగూడ మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈఘటనలో ఆమె మృతిచెందగా మిగతా వారికి గాయాలయ్యాయి. అ ఘటన మరువకముందే శ్రీకాకుళానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో అడలి వ్యూపాయింట్కు వెళ్లి మార్గమధ్యంలోని మలుపువద్ద అక్కడి లోయలోకి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది గాయపడ్డారు. అప్పటికి కొద్దిరోజుల్లోనే పిక్నిక్కు వెళ్లిన మరో కుటుంబం సవర గొయిది సమీపంలో డౌన్ దిగుతుండగా పక్కన ఉన్న గట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఆడలి వ్యూ పాయింట్ నుంచి దిగి వస్తున్న ఆటోను దాని వెనుక నుంచి వస్తున్న మరో ఆటో ఢీకొట్టగా ముందు ఆటో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో బూర్జమండలం కురుంపేటకు చెందిన బొడ్డు యశోదమ్మ, వెల్లంగూడకు చెందిన సవర రెల్లయ్య మృతిచెందారు. అలాగే మే 20న సీతంపేటకు చెందిన గిరజాల వేణుమాధవ్ వెల్లంగూడ మలుపు వద్దకి వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుతప్పి లోయలో పడడంతో మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న
పిక్నిక్లు
పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే
ఘాట్రోడ్లలో మలుపుల వద్ద ప్రమాదాలు
అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోని పర్యాటకులు
అవగాహన కల్పించినా కానరాని ఫలితం
పోలీసుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ వద్దని సూచించినా కొందరు టూరిస్టులు అవేవీ పట్టించుకోకుండా వ్యవహరించడం మూలాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆడలి వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో రూ.కోటి వ్యయంతో మలుపుల వద్ద రక్షణ గోడలు నిర్మిస్తున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి
వ్యూపాయింట్లకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదముంది. ఘాట్రోడ్లో వాహనాలతో దిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. న్యూట్రల్లో కాకుండా గేర్లో రావాలి. ఆడలి, జగతపల్లి వైపు వెల్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి.
వై.అమ్మన్నరావు, ఎస్సై, సీతంపేట

ఆహ్లాదం మాటున విషాదం

ఆహ్లాదం మాటున విషాదం

ఆహ్లాదం మాటున విషాదం

ఆహ్లాదం మాటున విషాదం