
ట్రాక్టర్ మీదపడి యువకుడి మృతి
తెర్లాం: మండలంలోని పెరుమాళి గ్రామంలో ట్రాక్టర్ మీదపడడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెరుమాళి గ్రామానికి చెందిన పొడ్ల రాము(23) సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ను కడిగేందుకు స్థానికంగా ఉన్న ఓ చెరువుకు తీసుకువెళ్లాడు. ట్రాక్టర్ కడగడం పూర్తవడంతో దాన్ని పైకి తెచ్చేందుకు డ్రైవింగ్ చేస్తుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయి ఇంజిన్ భాగం పైకి లేచిపోయింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడిపోతుందని గమనించిన డ్రైవర్ రాము వెంటనే కిందకు దూకేశాడు. దూకేసిన రాముపై ట్రాక్టర్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొన ఊపిరి ఉందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై తెర్లాం ఎస్సై సాగర్బాబు వద్ద ప్రస్తావించగా దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని తెలిపారు.
లారీ కింద పడి యువకుడు..
విజయనగరం క్రైమ్: నగరంలోని జేఎన్టీయూ జంక్షన్ వద్ద సొమవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధుపాడకు చెందిన ఎర్రయ్య (21) తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తుండగా జేఎన్టీయూ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఎర్రయ్య స్నేహితుడు ముందు పడిపోగా బైక్ నడుపుతున్న ఎర్రయ్య లారీ వెనక చక్రం వద్ద పడ్డాడు. ఆగి ఉన్న లారీ అప్పుడే బయలుదేరడంతో లారీ చక్రాలు ఎర్రయ్య మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీఐ చౌదరి ఆదేశాలతో ఎస్సై లక్ష్మునాయుడు మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు పోస్ట్మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వ్యాన్ ఢీకొని వృద్ధురాలు..
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామంలో ఇంటిబయట కుర్చీలో కూర్చుని సేదదీరుతున్న వృద్ధురాలిని వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్సై గణేష్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మజ్జి అన్నపూర్ణ(65) ఆదివారం రాత్రి పాన్ షాపు వద్ద కుర్చీలో కూర్చుని సేదదీరుతోంది. అదే సమయంలో నెల్లిమర్ల నుంచి వచ్చిన ఓ వ్యాన్ ఆ వృద్ధురాలిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వ్యాన్ను నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతురాలి అల్లుడు గురునాయుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్ మీదపడి యువకుడి మృతి

ట్రాక్టర్ మీదపడి యువకుడి మృతి