
మడ్డువలస ప్రాజెక్టులోకి 3వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులోకి మూడు వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నీరు వచ్చి చేరుతుందని అధికారులు ఆదివారం వెల్లడించారు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మూడు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.34 మీటర్లు లెవెల్ నీటి మట్టం నమోదైంది. ఒక గేటు ఎత్తి 1720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు.
గోవా గవర్నర్కు
ఘన స్వాగతం
విజయనగరం: గోవా గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజుకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం విజయనగరం విచ్చేశారు. ఆయనకు స్థానిక అశోక్ బంగ్లా వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇన్చార్జ్ ఆర్డీవో మురళి, అశోక్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంతకు ముందు పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంగ్లాకు చేరుకొని, అశోక్ గజపతిరాజుకు పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా దీపోత్సవం
బొబ్బిలి: పట్టణంలోని దిబ్బ వీధిలో వెలసిన వినాయక మండపంలో ఆదివారం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి భక్తి గీతాలు ఆలపించగా పురోహితులు మంత్రోచ్ఛారణ చేశారు. పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఐదో రోజైన ఆదివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
శారీరక దృఢత్వంతో ఆరోగ్యం
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ ఆన్ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ధృడత్వంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం మన జీవన శైలిలో ప్రతీ రోజు ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణిస్తూ ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం లేకపోవడంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు సైక్లింగ్ సాధారణ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సరళమైన, సురక్షితమైన మార్గంతో పాటు పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకొనేందుకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కేంద్రం మీదుగా వెళ్లి మళ్లీ మైదానానికి చేరుకుంది. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మడ్డువలస ప్రాజెక్టులోకి 3వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో

మడ్డువలస ప్రాజెక్టులోకి 3వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో