
ఇదేం చిత్రం సారూ..!
● టాస్క్ఫోర్స్, విజిలెన్స్ రహస్య తనిఖీలు ● బెల్టు దుకాణాలపై కేసులు
చీపురుపల్లి: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో నిఘా నేత్రాలుగా ఉన్న టాస్క్ఫోర్స్, విజిలెన్స్ విభాగాలు చర్యలు కాస్త చర్చాంశనీయంగా మారుతున్నాయి. సాధారణంగా మద్యం దుకాణాలు, అక్రమ రవాణా, అధిక ధరలకు విక్రయాలు తదితర అంశాలపై టాస్క్ఫోర్స్, విజిలెన్స్ తనిఖీలు జరిగితే మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఇంతవరకు జరిగేది. తాజాగా చీపురుపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో ఈ నెల 26న జరిగిన టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీలు, నమోదు చేసిన కేసులు చూస్తుంటే ఇదేం చిత్రం సారూ.. అన్న చందంగా ఉంది. ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు వచ్చి బెల్టు దుకాణాలపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అసలు బెల్టు దుకాణాలు లేవని ప్రభుత్వం చెబుతుంటే బెల్టు దుకాణాలపై సాక్షాత్తూ టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది. బహుశా అందుకేనేమో ఆ కేసుల విషయాన్ని బయిటకు పొక్కనివ్వకుండా ఉంచారనే చర్చ జరుగుతోంది.
బాటిళ్లపై స్టాంప్ల సంగతేంటి?
ఈ నెల 26న ‘సొంత బ్రాండ్.....మద్యం బాబులకు బ్యాండ్’ అనే శీర్షికన సాక్షిలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన జిల్లా అధికారులు టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులను తనిఖీలకు పంపించినట్టు సమాచారం. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లోని జల్లెడ పట్టిన టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు చివరకు బెల్టు దుకాణాలపై మూడు కేసులు నమోదు చేశారు. అయితే మద్యం బాటిళ్లపై స్టాంప్ సంగతి మాత్రం పక్కన పెట్టేశారు. టాస్క్ఫోర్స్, విజిలెన్స్ తనిఖీలకు సైతం ఇక్కడ సిండికేట్ ఎదురు తిరగడంతో వారి మధ్య ఉన్న సత్సంబంధాలు కారణంగా స్టాంప్ సంగతి పక్కన పెట్టి సాధారణ పౌరులపై మూడు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్టు సమాచారం. ఇదే విషయమై ప్రొహిబిషన్ అండ్ ఎకై జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ చక్రవర్తి వద్ద ప్రస్తావించగా ఈ నెల 26న టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారన్నారు. ఎక్కడా స్టాంపులు ఉన్న బాటిళ్లు లభించలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.